ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 11:12 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

కిలోలకుపైగా బంగారం..335 కిలోల వెండితో గణనాధుడు

కిలోలకుపైగా బంగారం..335 కిలోల వెండితో గణనాధుడు

ముంబై సెప్టెంబర్ 8, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 8.)

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. భక్తుల కోరికలను తీర్చే గణనాథుడు.. గణేశోత్సవం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి మొదలవుతుంది. ముఖ్యంగా ముంబైలో జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తి, సంప్రదాయం, సేవ, వైభవం కలగలిసిన గణపతి ఉత్సవాలు ప్రతి ఏటా లక్షలాది మందిని ఆకర్షిస్తాయి. అలాంటి విశిష్ట గణపతి ఉత్సవాల్లో ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో ఉన్న జీఎస్ బీసేవా మండల్ మహాగణపతి ఉత్సవం ఒకటి. ఈ ఏడాది 72వ గణేశోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు మండల్ సిద్ధమైంది. ఈసారి మహాగణపతికి ఏకంగా రూ.703.27 కోట్ల భారీ బీమా రక్షణ కల్పించారు. బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులు, భక్తుల రాకపోకలు తదితర అంశాలకు ఈ బీమా రక్షణ కల్పిస్తోంది.మహాగణపతి విగ్రహానికి ఈ ఏడాది 66 కిలోలకుపైగా బంగారు ఆభరణాలు, 335 కిలోలకుపైగా వెండి ఆభరణాలు అలంకరించనున్నట్లు సమాచారం. వీటికి తోడు విలువైన రత్నాలు కూడా గణనాథుడి అలంకరణలో భాగం కానున్నాయి. ఈ ఆభరణాల్లో చాలా వరకు భక్తులు, సేవాదారులు సంవత్సరాలుగా స్వామివారికి సమర్పించినవే. భక్తుల విశ్వాసానికి ప్రతీకలుగా నిలిచిన ఈ ఆభరణాలు ప్రతి సంవత్సరం మహాగణపతి అలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో ఈ ఆభరణాల విలువ కూడా గణనీయంగా పెరిగింది. దాంతో గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి బీమా విలువ కూడా భారీగా పెరిగింది.2024లో సుమారు రూ.400 కోట్ల బీమా ఉండగా, 2025లో అది రూ.474 కోట్లకు చేరింది. ఇప్పుడు 2026లో ఏకంగా రూ.703.27 కోట్లకు పెరగడం గణపతి ఉత్సవ వైభవాన్ని తెలియజేస్తోంది.ముంబైలో 1951లో GSB సేవా మండల్ ఏర్పాటైంది. 1955లో గణేశోత్సవ వేడుకలను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా మహాగణపతి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది మహాగణపతి తొలి ప్రజా దర్శనాన్ని ‘విరాట్ దర్శన్’ పేరుతో సెప్టెంబర్ 12న రాత్రి 8 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రధాన ఐదు రోజుల గణేశోత్సవం సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు గణనాథుడిని దర్శించుకునేందుకు తరలివచ్చే అవకాశం ఉంది.
లక్షకు పైగా పూజలు.. ప్రతిరోజూ 40 వేల మందికి అన్నదానం
సేవా మండల్ ఉత్సవం కేవలం బంగారు ఆభరణాలు, భారీ అలంకరణలతో మాత్రమే ప్రత్యేకం కాదు. భక్తి, సేవ, అన్నదానం ఈ ఉత్సవంలో ప్రధాన భాగాలు. ఈ ఐదు రోజులలో భక్తులు, సేవాదారుల ద్వారా లక్షకు పైగా పూజలు, సేవలు నిర్వహించబడతాయని మండల్ అంచనా వేస్తోంది. అదేవిధంగా ప్రతిరోజూ సుమారు 40 వేల మందికి ప్రసాద భోజనం అందించేందుకు అన్నదాన సేవను నిర్వహించనున్నారు. అంటే ఐదు రోజులలో కలిపి రెండు లక్షల మందికిపైగా భక్తులకు అన్నప్రసాదం అందే అవకాశం ఉంది. ‘అన్నదానం మహాదానం’ అనే భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.ఈ ఏడాది ఉత్సవాల్లో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. మహాగణపతి విగ్రహాన్ని పూర్తిగా పర్యావరణహితంగా రూపొందించనున్నారు. అంతేకాకుండా పూజలు, సేవలు, విరాళాలకు సంబంధించి గతంలో ఉపయోగించే ముద్రిత రసీదులను నిలిపివేసి డిజిటల్ రసీదుల విధానాన్ని అమలు చేస్తున్నారు. భక్తి కార్యక్రమాలతో పాటు పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను కూడా గుర్తుచేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం.ముంబై GSB సేవా మండల్ మహాగణపతి ఉత్సవం కేవలం ఒక భారీ ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల విశ్వాసం, తరతరాల సంప్రదాయం, దైవ సేవ, అన్నదానం, పర్యావరణ పరిరక్షణ.. ఇవన్నీ కలిసిన ఒక ఆధ్యాత్మిక వేడుక. బంగారు, వెండి ఆభరణాలతో మహాగణపతి అలంకారం ఎంత వైభవంగా కనిపించినా.. భక్తులకు అన్నదానం చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలే ఈ ఉత్సవానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకొస్తాయి.